1. దత్తపది: “అర - చెర - ధర - ముర” పదాలను అన్యార్థంలో
ఉపయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని
వ్రాయండి.
(శరతల్ప గతుడైన భీష్ముడు శ్రీకృష్ణునితో)
అరవిందనయన! కృష్ణా!
చెరలాడితి నీబ్రతుకున చేతోగతితో;
మురళీమోహనరూపా!
గిరిధర! ముక్తుని సలుపుము, కేలున్ మోడ్తున్.
2. దత్తపది: “రయము - భయము - జయము - నయము” పదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(యజ్ఞాశ్వాన్ని బంధించిన లవకుశులు)
రయమున నేగుదెంచినది లాలితరీతిని నశ్వమంతటన్;
భయమున కాయముల్ వణక వందురసాగిరి మౌనిబాలకుల్;
జయమును పొందనెంచిన కుశాగ్రమతుల్ లవుడున్ గుశుండునున్
నయముగ బట్టితెచ్చి జవనాశ్వము నుంచిరి బంధనంబునన్.
3. దత్తపది: “అరిసె - గారె - పూరి - వడ” పదాలను అన్యార్థంలో
ఉపయోగిస్తూ రామాయణార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(రావణుని పరాక్రమం – దేవతల పరాజయం)
రావణబ్రహ్మ పూరించు రౌద్రశంఖ
రవము విని మూర్ఛితులు గారె రాజులెల్ల!
గగన మందుండి పడు వడగండ్ల రీతి
అరిసెగలు దాకి సురలును అదరి పడరె!
4. దత్తపది: “అవ్వ - తాత - అత్త - మామ” పదాలను అన్యార్థంలో
ఉపయోగిస్తూ భారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(అర్జునుడు ఊర్వశితో)
వనితా! తప్పిది! యొప్పదు;
నిను నత్తను వలనుపడదు; నిర్మలచిత్తం
బున నవ్వలి తెరగరయుము;
కను మామకవిధి లతాంగి! కరుణను జనుమా!
5. దత్తపది: “కన్ను - ముక్కు - చెవి - నోరు” పదాలను అన్యార్థంలో
ఉపయోగిస్తూ రామాయణార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(శ్రీరాముని శివధనుర్భంగం)
వీరరఘువంశతిలకుండు విరచె విల్లు;
శివు డమరు డుముక్కని చెలగి మ్రోగె;
సురలు వీకన్నుతుల తోడ విరుల నిడిరి;
చేతనోరు జానకి కింక సిగ్గు కలిగె.
6. దత్తపది: “కిక్ - లక్ - చెక్ - నెక్” పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(పాండవుల వనవాససందర్భం - సుభద్రతో శ్రీకృష్ణుడు)
చివురుచెక్కిళ్ళ కన్నీరు చిందనీకు;
చెల్లి! నీకిక్క డేకీడు చేరదమ్మ!
ఎట్టి యిడుముల కొండైన నెక్కగలిగి
యరుగుదెంతురు పాండవు లక్కజముగ.
7. దత్తపది: “తల - మెడ - కడుపు - వీపు” పదాలను అన్యార్థంలో
ఉపయోగిస్తూ భారతార్థంలో నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(నర్తనశాలలో కీచకుడు సైరంధ్రి రూపంలోని భీమునితో )
తలపులెన్నెన్నొ ముసిరెను కలికిమిన్న!
కడు పునీతుడ నయ్యెద గనుము నన్ను;
కాల మెడమైన నోపను కరుణ జూపు;
తగ్గవీ పులకింతలు సిగ్గుపడకె!
8. దత్తపది: “దొర - డబ్బు - అప్పు - వడ్డి” పదాలను ఉపయోగిస్తూ ఋణగ్రస్తుని బాధను వర్ణిస్తూ నచ్చిన
ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(వేంకటేశ్వరునికి
వేదనానివేదన)
దొరకునా స్వామి! వేదన దొరలు దినము?
స్వేచ్ఛ యెపుడబ్బునయ్య యో శ్రీనివాస?
సరసి యప్పుల స్నానము సలిపినాడ;
మదిని శాంతిని వడ్డింపుమయ్య! నాకు.
9. దత్తపది: “ఆట - పాట - బాట – మాట” పదాలను ఉపయోగిస్తూ ప్రపంచ
తెలుగు మహాసభలను గురించి నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(తెలంగాణ ప్రాంగణం –
తెలుగుతల్లి వీక్షణం)
పాటలంబైన కాంతులు పరిఢవిల్లె;
బాటమీరని మరియాద బయలువెడలె;
మాటకందని మమతలు మదుల పొంగె;
ఆంధ్రభారతి తెలగాణ నాటలాడ.
10. దత్తపది: “మేరీ - యేసు - సిలువ - చర్చి” పదాలను
అన్యార్థంలో ఉపయోగిస్తూ
శ్రీకృష్ణుని స్తుతిస్తూ నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
(యశోదమ్మ
గోపకాంతలతో)
పాడియే సుపుత్రుని గూర్చి పలుకనిట్లు?
తప్పు; మీయుల్ల మేరీతి నొప్పుకొనియె?
మంచి భాసిలు వట్టి యమాయకుండు;
చాలులెండమ్మ చర్చింప జాణలార!
11. దత్తపది: “హస్త - చిత్త - స్వాతి - మూల” పదాలను
అన్యార్థంలో ఉపయోగిస్తూ
షడ్రసోపేత భోజనాన్ని వర్ణిస్తూ నచ్చిన
ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(వధూవరులు స్వాతి –
కృష్ణుల బువ్వపుబంతి)
మూలపాత్రను బాయస మొదవజేయ,
చిత్తమలరగ కూరల జెంత నుంప,
హస్తముల బిండివంటలు నందగింప,
స్వాతి- కృష్ణుల బువ్వపుబంతి జరిగె.
12. దత్తపది: “నది - మది - పది - గది” పదాలను ఉపయోగిస్తూ గురుశిష్య
సంబంధాన్ని వివరిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(తిక్కనమహాకవి పినాకినీ నదీతీరంలో శిష్యుడైన గురునాథునితో)
శిష్య! గురునాథ! మననది జేరినాము;
మదికి సంతోష మాయెను; మహితమతివి;
పదిలముగ గంటమును దాళపత్రములను
బట్టి, తెలుగది వ్రాయుము భారతమ్ము.
13. దత్తపది: “నిండుగ - పండుగ - మెండుగ - దండిగ” పదాలను
ఉపయోగిస్తూ
అవధాన వైభవాన్ని వివరిస్తూ నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
(అష్టావధాన, శతావధాన, సహస్రావధాన వైభవం)
నిండుగ నష్టపద్యముల నేర్పుగ బల్కును నొక్క పూజ్యుడున్;
పండుగ సల్పు నూరయిన పద్యసుమమ్ముల నొక్క యార్యుడున్;
మెండుగ వేయిపద్యముల మీరును మేధను నొక్క ప్రౌఢుడున్;
దండిగ వాణిపాదముల దక్షత గొల్తురు సత్కవీంద్రులున్.
14. దత్తపది: “కన్ను - చెన్ను - పన్ను - దన్ను” పదాలను
ఉపయోగిస్తూ హనుమంతుని వర్ణిస్తూ నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(హనుమంతునితో ఇంద్రజిత్తు)
కన్నులు మూసికొంచు నెటు కాలిని బెట్టితివోరి లంకలో?
చెన్నులు మాసిపోవగను చింతలబాటయె నీకు తధ్యమౌ;
పన్నుగ వానరాధముడ! ప్రాణము దీసెద గాచుకొమ్మికన్
దన్నులు, దోకకాల్పులును దప్పవు నీవిక
పాదమంటరా!
15. దత్తపది: “దేశము - కోశము - పాశము - నాశము” పదాలను
ఉపయోగిస్తూ
దేశభక్తిని ప్రబోధిస్తూ నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
(సర్వాగ్రగణ్య దేశమాత)
కోశము చక్కజేసికొని కూర్మిగ నందరు గూడియుండగా;
పాశము చుట్టుముట్టి నవభారతమాతకు సేవజేయుచున్;
నాశము నందగా మకిలి నాణ్యత నల్గడ మోసులెత్తగా;
దేశముకంటె మించినది దీక్షగ జూచిన నేదిలేదురా.
16. దత్తపది: “ఏరు - పారు - ఊరు - మారు” పదాలను ఉపయోగిస్తూ
పల్లీయ సౌందర్యాన్ని వర్ణిస్తూ నచ్చిన
ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(మన గ్రామం)
ఏరులు నేరులై పడగలెత్తును చుట్టరికంపు పిల్పులున్;
పారును పుష్కలంబుగను బర్వుల దీయుచు వాగువంకలున్;
ఊరును నోటిలో జలము లూరిన పచ్చడు లెంచిచూచినన్;
మారును యంత్రజీవనము మంగళమూర్తిని పల్లె గాంచినన్.
దత్త పది..ఏరు,పారు,ఊరు,మారు
రిప్లయితొలగించండిఏరు పొంగగా జనులకు ఏల ప్రశ్న
పారు నీరుపల్లమునకే ప్రకృతి ప్రశ్న
ఊరు నోరుమంచిదిఐతే ఊరు ప్రశ్న
మారుమూలన మనవాడు మనసు ప్రశ్న
మాలిక కదంబ మేనులే మహిమ ప్రశ్న ఈశ్వరా